Jump to content

భస్మాసురుల పండుగ!!


Buttertheif

Recommended Posts

pointblank.jpgపాతిక రోజుల క్రితం అనుకుంటా..

పట్టిసీమ వద్ద అద్భుత దృశ్యం.. బ్రేక్ తర్వాత..! .. మొహం వెయ్యివోల్టుల బల్బులా వెలిగిపోతుండగా సీమాంధ్రచానల్ వార్తల్లో ఓ న్యూస్ రీడరమ్మ చెప్తున్నది. ఆ ముఖంలో అసూయకలిగించేంత ఆనందం. ఏదో యథాలాపంగా, వృత్తి ధర్మంగా చెప్పలేదు. చాలా ప్రేమగా.. ఆప్యాయంగా గుండెలోతుల్లోంచి వచ్చిన ఫీలింగ్‌కు మాటలను కనెక్ట్ చేసినట్టు చెప్పిందా మాటలను. సీమాంధ్రకు పనికివచ్చే నీటి పథకం. కనుక ఆ సంతోషం. వాస్తవానికి అదేమంత గొప్ప పథకం కాదు. చిన్న లిఫ్టు. ఏదో ఎడారి భూముల్ని తడిపేసి కన్నీళ్లు తుడిచేదీ కాదు. ఉన్న ఆయకట్టు స్థిరీకరణకో రెండో పంటకు భరోసాకో ఉద్దేశించింది. పైగా ఆ పథకం అదేరోజు తొలిసారి ప్రారంభమూ కాలేదు. అదే చంద్రబాబు.. అదే పట్టిసీమకు కృష్ణాజిల్లానుంచి మొదలుపెట్టి పశ్చిమగోదావరి జిల్లాదాకా మూడో సారో నాలుగో సారో పూజలు చేశారు. అయినా ఆ సంతోషం అంబరమంటుతున్నంత గొప్ప వ్యక్తీకరణ. ఆ తర్వాత సదరు కథనం పొడవునా లిఫ్టు పంపుల్లోంచి ఎగజిమ్ముతున్న నీటి నురగల మీద ఇంద్రధనుస్సు పరుచుకున్నంత ఉత్సాహం. గోదారమ్మ, కృష్ణమ్మ.. ముక్కారు పంటలు.. దశాబ్దాల కలలు.. వగైరా వగైరా.

నిజం చెప్పొద్దూ.. అసూయగా అనిపించింది. వాళ్లేదో బాగుపడుతున్నారని.. నీళ్లేవో పోతున్నాయని కాదు. గోదావరిలో బోలెడున్నాయి. కానీ వాటిని మళ్లించుకోవాలన్న తపన.. వాళ్లకున్న ఆ తాపత్రయం.. అదీ చూసి. ఎపుడో 1900లో గోదావరి మీద కాటన్ బ్యారేజీయే కాకుండా భారీ ప్రాజెక్టు కావాలనే ఆలోచన అక్కడ అలా మొగ్గ తొడిగింది. జమీందారుల కాలంలో దివాన్‌ల కృషితో శబరి మీద ఒకటి, గోదావరి మీద మరొకటీ ప్రాజెక్టులు ప్రతిపాదించారు. ముప్ఫయ్యవ దశకంలో భద్రాద్రి రాముడి కొండ పాదాలు తాకేలా రామపాదసాగర్ పేరిట ఆ ప్రాజెక్టును గ్రౌండ్ చేసేదాకా తీసుకువెళ్లారు. 2004 తర్వాత పోలవరం పేరుతో పనులు మొదలు పెట్టారు. ఈ లిఫ్టు అందులోదే. అంటే 116 ఏండ్లు ఆ భావనను తరం తర్వాత తరం అలా మోసుకుంటూ వస్తూనే ఉన్నారు. ఈ ప్రాజెక్టుకోసం అయ్యదేవర కలగన్నారు. ప్రకాశం పంతులు కలగన్నారు. సుందరయ్య కలగన్నారు. ఎన్జీ రంగా కలగన్నారు. వైఎస్ కూడా కలగన్నారు. ఈ డ్యాం కిందనుంచి నీరు పోతుంటే నా జీవితకాలంలోనే చూడాలని నెహ్రూతో నేనన్నాను అన్నారు శొంఠి రామ్మూర్తి. ఆయన ఆనాటి మద్రాసు ప్రభుత్వంలో ప్రధాన ఇంజినీరు. గొప్పవాడు. నెహ్రూను ఉదయం కలిసి సాయంత్రానికి సర్వే అనుమతి సాధించినవాడు. ఆయనే కాదు.. సీఆర్ రెడ్డిలాంటి మేధావులు మొదలుకొని నిన్నామొన్నటి ఉండవల్లి, చలసానివంటి వారిదాకా అంతా గొప్పగా ప్రచారాలు చేశారు. అందరిదీ ఒకే కల.. ఒకే గొంతు.. రాజకీయాలతో సంబంధం లేదు. నీరు నీరే.. రాజకీయం రాజకీయమే. పులిచింతలా అంతే! ఉన్నమాట చెప్పాలి. ఆంధ్రులు అదృష్టవంతులు. అనుకున్న ప్రతీదీ సాధించుకోగలరు. గలిగారు కూడా. ఎవరితో కలిసినా అవతలి వాళ్లది పొందారే తప్ప తమ సొమ్ము ఆవగింజంత కూడా పోనిచ్చిన చరిత్రే లేదు. మద్రాసు రాష్ట్రంలో ఉన్నపుడు అరవవాళ్లు దోచుకుంటున్నారని గగ్గోలు పెట్టి నిధులు, పదవులు సాధించుకునే వారు. గోదావరి బ్యారేజీ, కృష్ణా బ్యారేజీలు వాళ్లతోనే కట్టించుకొని వాళ్లు కాసిని నీళ్లకోసం కృష్ణా పెన్నార్ ప్రాజెక్టు తలపెడితే గోలగోల చేసి ఆపేయించారు. 

విడిపోయినపుడు మద్రాసుపై పేచీ పెట్టి తిరుపతి సాధించుకున్నారు. తెలంగాణతో కలిసి శ్రీశైలం, నాగార్జునసాగర్ మొదలుకొని పోలవరం, పులిచింతల, పోతిరెడ్డిపాడు కట్టేసుకున్నారు. అరవై ఏండ్లు ఇక్కడి భూములు, ఉద్యోగాలు, వ్యాపారాలు సరేసరి. ఇక్కడా విడిపోయే ముందు మళ్లీ రాజధాని లేదనే సాకుతో తామే ఒక బాధిత రాష్ట్రంగా ప్రచారం చేసుకుని ఐఐటీలు, ఐఐఎంలనుంచి అనేక సంస్థలు సాధించుకున్నారు. కనిపిస్తున్న సూచనలను బట్టి ప్రత్యకహోదాతో సమానమైన ఆర్థిక సహాయం మీద త్వరలోనే కేంద్రం ప్రకటన చేయవచ్చు. గమనించాల్సింది ఏమిటంటే.. ఆంధ్రలో రాజకీయ నాయకులు, మేధావులు, సామాజిక వేత్తలంతా ఒక్కటే పాట. ఒక్కటే స్వరం. తెల్లవారి లేస్తే తన్నుకునే పార్టీలన్నింటిలోనూ ఒకటే మాట.. విభజనలో నష్టపోయాం అని. రెండోమాట ఉండదు. కృష్ణా జలాల వివాదం అయినా.. హైదరాబాద్ మీద పెత్తనం అయినా.. ఉద్యోగాల పంపిణీ అయినా.. పోలవరం నిర్మాణమైనా.. ప్రత్యేక హోదా అయినా చంద్రబాబు అన్నదే జగన్ అంటారు. జగన్ అన్నదే రఘవీరా అంటారు. ఆఖరుకు బీజేపీ హరిబాబు కూడా అదే అంటారు. వీళ్లు అంటున్నవే వెంకయ్యా అంటారు. దిగ్విజయ్ అంటారు. జైరాం రమేశ్ కూడా అంటారు.
దౌర్భాగ్యం ఏమిటంటే మన దగ్గర తెలంగాణ ప్రయోజనాల విషయంలో కూడా ఏకాభిప్రాయం ఉండదు. చంద్రబాబు కరెంటు ఫ్యూజు పీకేస్తె.. కేసీఆరే అడగలేదని టీడీపీవాళ్లంటారు. కేసీఆర్ కేంద్రాన్ని అడగనే లేదని బీజేపీవాళ్లు వాదిస్తారు. 

కరెంటు ఉత్పత్తిని గాలికి వదిలేసిన కాంగ్రెసోళ్లు కేసీఆర్ విఫలమయ్యారని వీరంగం వేస్తారు. అంతే తప్ప బాబును వీళ్లెవరూ పల్లెత్తి మాట అనరు. అంతటితో ఆగరు. ఆంధ్ర ఓట్లను తీసేస్తున్నారని బీజేపీ కిషన్‌రెడ్డి అంటారు. కాంగ్రెస్ శశిధర్‌రెడ్డి అంటారు. ఇంద్రసేనారెడ్డి ఈసీని కలిసి తీసేసిన ఓట్లను మళ్లీ కలపాలని ఆదేశాలే తెస్తారు. కాంగ్రెస్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అయితే టీఆర్‌ఎస్ ఆంద్రోల్లను తిట్టింది.. ఓట్లేయవద్దని ప్రచారం చేస్తారు. గురుకుల్ భూముల్లోకి జేసీబీలు వెళితే వీళ్లే గుంపులు గుంపులుగా అడ్డం పడతారు. కొత్త సచివాలయం కడతానంటే కోర్టులకెక్కుతారు. హుస్సేన్‌సాగర్ శుభ్రం చేస్తానంటే గ్రీన్ ట్రిబ్యునల్ ముందు గొడవ చేసి ఆపేయిస్తారు. సమగ్ర సర్వే అంటే ఆంద్రోల్లను తరిమేస్తున్నారని గగ్గోలు పెట్టి లేని పంచాయతీలు తెస్తారు. దశాబ్దాల శాపానికి విముక్తిగా ప్రాజెక్టులు చేపడితే మిన్నూ మన్నూ ఏకం చేసేంత లొల్లి. స్థలం మార్చవద్దు అని ఒకరు.. రిజర్వాయర్లు కుదించాలని ఒకరు. పేరు మార్చవద్దని ఇంకొకరు.. ముంపు ఉండవద్దని మరొకరు..అసలు రిజర్వాయరే కట్టవద్దని వేరొకరుడు. ఒకరికి అవినీతి కన్పిస్తే మరొకరికి దుబారా కనిపిస్తది. ఇంకొకరికి పోలీసు రాజ్యంకనిపిస్తది.

 

ప్రాజెక్టు ఆగితే పండుగలు..

టీవీలో బ్రేకింగ్ వార్త వస్తున్నది.. జీవో 123,124లను కోర్టు కొట్టివేసింది మహోత్సాహంగా ప్రకటిస్తున్నాయి సీమాంధ్ర చానళ్లు. నౌబత్ ఖానాలో మోగినట్టు వెనక రణభేరీ ధ్వనులు. ఆ బ్రేకింగ్ వార్త పక్కనే నిర్వాసితులు పోలీసుల మధ్య చోటు చేసుకున్న దృశ్యాలు చూపిస్తున్నాడొకడు. గాంధీభవన్‌లో పండుగ వాతావరణం నెలకొందట. నాయకులు స్వీట్లు పంచుకుంటున్నారట. డాన్సులు. హర్షాతిరేకాలట. సరే రాత్రి చీర్స్‌కూడా ఉంటాయేమో! కేసీఆర్ రాజీనామా చేయాలి.. డిమాండ్ చేస్తున్నారు ఉత్తమ్‌కుమార్. చాలా రోజుల తర్వాత ఆయన ముఖం వెలిగిపోతున్నది. బుద్ధి రావాలి.. ఎవరో నాయకుడు వ్యాఖ్యానిస్తున్నారు. మేం ముందునుంచి చెప్తున్నాం అంటున్నాడో మేధావి. వాస్తవంగా ప్రభుత్వం జీవో తీసుకురావటమే కాదు.. దానికి రాష్ట్రపతి ఆమోదం కూడా కావాలట. న్యాయనిపుణులు మాకు చెప్పిండ్రు.. ఇక 2013 తప్ప ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం లేదనే ఉత్సాహం మాటల్లో ప్రతిఫలిస్తుండగా ఫోన్‌ఇన్‌లో ఆనందంగా చెప్తున్నారో పెద్దపంతులు. ఇప్పటికైనా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని అంటున్నారు తమ్మినేని. విజయగర్వం ముఖంలో వద్దన్నా దాగదు కదా! దీని ప్రభావం అన్ని ప్రాజెక్టుల మీదా ఉంటుంది.. భవిష్యవాణిని అపుడే చెప్తున్నదో చానెల్. ఎవరి ఆనందం వారిది. 
 

ఏమిటీ సమస్య....!!

వస్తే అధికారం చెలాయించటం.. ఓడితే తెల్లారినుంచే ప్రభుత్వాల మీద బురద చల్లుతూ వ్యతిరేకత సృష్టిస్తూ పోవటం అనే ఏక సూత్రాన్ని రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు దశాబ్దాలుగా అనుసరిస్తూ వస్తున్నాయి. ఆ సూత్రానికి అనుగుణంగానే ఎన్నికల్లో ఫలితాలూ అటుఇటుగా వస్తూ వచ్చాయి. కాబట్టి ఇపుడూ అదే పరిస్థితి కొనసాగాలని అవి కోరుకుంటున్నాయి. ఇక అధికారంలోకి రాలేని పార్టీలు సంఘటిత వర్గాల సంఘాలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడానికి అలవాటు పడ్డాయి. మాట వినని ప్రభుత్వాలపైకి సంఘాలను ఉసి గొలిపి సమ్మెలతో దారికి తెచ్చుకోవడానికి అలవాటు పడ్డాయి. ఇక ప్రజాసంఘాల దుకాణాల దారి వేరు. ప్రభుత్వ నిర్ణయాలకు జడ్జి, అంపైర్ పాత్రలకు బాగా అలవాటు పడ్డాయి. తాము ముద్ర వేస్తేనే కరెక్టు అనే వాతావరణం సృష్టించేందుకు అలవాటుపడ్డాయి. సచివాలయంలో ఎర్రతివాచీ ఆహ్వానాలకు, మీడియాలో ప్రాముఖ్యతకు అలవాటు పడ్డాయి. వీళ్లకూ వర్తమానం పాత పద్ధతిలోనే ఉండాలి. ధర్మపీఠాలు పదిలంగా ఉండాలి. అపుడే వర్సిటీల్లో ఆదరణ. అపుడే చుట్టూ గుంపులు.. సమూహాలు. దేశ విదేశ పర్యటనలు.. మీడియా కవరేజీలు. అనేక దశాబ్దాలనుంచీ ఇదే కొనసాగుతూ వస్తున్నది. రాజకీయవాదులను అవినీతిపరులు, అసమర్థులుగా వీలైతే బఫూన్లుగా చిత్రించి తాము హీరోలు కావటం అనే ఫార్ములాకు బాగా అలవాటు పడ్డారు. అదే స్క్రిప్టు.. అవే డైలాగులు.. అవే ఆందోళనలు.. అవే సమ్మెలు. సీమాంధ్ర మీడియా వీళ్లను.. వీళ్లు సీమాంధ్ర మీడియాను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు. వాళ్లు వీళ్లు కలిసి ఏదో రాజకీయాలను గుత్తకు తీసుకున్నట్టు వ్యవహరిస్తూ వస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక వీళ్ల పప్పులు ఉడకడం లేదు. అందుకే సింపుల్స్.. శాంపిల్స్ చూపించి అయిపోయింది అనిపించాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

గమ్మత్తేమిటంటే అందరూ తెగ నటించేస్తున్నారు. విషయం అస్సలు అర్థం కానట్టు..మీడియా కూడా డ్రామాలు ఆడుతూనే ఉంది. ఇక్కడ ఉపరితలం మల్లన్నసాగర్ అయినా ఆ సాగర గర్భంలో ఉన్న ఎజెండా ఏమిటో అందరికీ తెలుసు. ప్రభుత్వం కోర్టులో ఎదురు దెబ్బ తింటే ఆనందపడటం ఎందుకో తెలుసు. కాంగ్రెస్సైనా.. కమ్యూనిస్టులైనా.. ఎల్లిపాయలైనా ఉల్లిపాయలైనా.. అందరి లక్ష్యం ఒక్కటే. కాళ్లలో కట్టెలు పెట్టడం. కేసీఆర్‌ను ఓడించడం. కేసీఆర్ మీద పైచేయి సాధించడం. కేసీఆర్‌ను దెబ్బ కొట్టడం. తెలంగాణ లాభనష్టాలతో వీళ్లకు నిమిత్తం లేదు. ప్రజల బాగోగులతో నిమిత్తం అంతకన్నా లేదు. ఇవాళ జరుగుతున్న పరిణామాలు.. దానికే అద్దం పడుతున్నాయి. ఒక ప్రాంతం వెనుకబడి ఉండటానికి ఎవడో వచ్చి దోచుకోవటం ఒక్కటే కారణం కానక్కర లేదు. భస్మాసురుడైనా తన నెత్తి మీద తానే చెయ్యి పెట్టుకున్నాడు. 

ఒక్కటే ఆశ ఏమిటంటే.. ప్రజలు వేరుగా ఆలోచిస్తున్నారు. కొత్త రాష్ట్రంలో కొత్త పంథాను కొత్త రాజకీయాన్ని కోరుతున్నారు. ప్రతికూల ధోరణి వదిలిపెట్టి సానుకూల ఆలోచనలకు తావిస్తున్నారు. రాష్ర్టాన్ని కనీసం ఇప్పటికైనా బాగు చేసుకోవాలనే బలమైన ఆకాంక్ష కనిపిస్తున్నది. ఎక్కడో అమెరికాలో ఉన్నవాళ్లు తమ ఊరి చెరువుల గురించి ఆలోచిస్తున్నారు. తమ ప్రాంత ప్రాజెక్టుల గురించి వాకబు చేసుకుంటున్నారు. నేనురాను బిడ్డో దవాఖానకు అంటే గంతులేసిన రోజులు.. గతుకుల రోడ్ల మీద వెళితే గర్భవతులకు ప్రసవాలవుతాయనే నేలబారు సెటైర్లకు చప్పట్లు కొట్టిన రోజులకు కాలం చెల్లింది. మన రాష్ట్రం- మనం బాగు చేసుకోవాలి అనే భావన బలంగా కనిపిస్తున్నది. ఇవాళ ప్రజలు సానుకూలంగా ఆలోచిస్తున్నారు. నిరాశను తరిమికొడుతున్నారు. ఈ క్రమంలో ప్రతికూల రాజకీయాలను తిరస్కరిస్తున్నరు. చవకబారు రాజకీయాల కోసం అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపడటాన్ని అసహ్యించుకుంటున్నరు. చరిత్ర చెప్పుకొని బండి లాగే రోజులు కావు. ప్రజాస్వామ్యంలో ప్రజలతో కలిసి అడుగులేసే వాడే ముందుకు సాగుతాడు. లేకుంటే అనామకుడిగా కాలగర్భంలో కలిసిపోతడు. ఏ మార్గంలో వెళ్లాలనే నిర్ణయం ఇపుడు ఈ ప్రతికూల సమూహాలదే! 

 

ఆంధ్రులేమంటున్నారు..?

 

ఇక్కడ ఇంత జరుగుతున్నది. కానీ ఇవాళ ఇదే ప్రాజెక్టుల మీద ఆంధ్రులేమనుకుంటున్నారు? ఆంధ్రకు నీళ్లు మిగులనిస్తారా మిత్రమా! అడిగాడు ఓనాటి పాత పాత్రికేయసహచరుడు. ఇపుడు విజయవాడలో ఉంటున్నాడు. కేసీఆర్ చేపట్టిన ప్రాజెక్టులు అక్కడ గుబులు పుట్టిస్తున్నాయట. కేసీఆర్ ఏది చేసినా భారీగా ఉంటుంది. హరితహారం మా వాడు కోటి అంటే కేసీఆర్ రెండొందల కోట్ల పైచిలుకు అన్నాడు. మంచినీరు చూడు.. కరెంటు చూడు. ఏదైనా భారీగానే. నేననుకోవటం కేసీఆర్ ఒక పంటతో తృప్తిపడే మనిషి కాదు. మీవాడు ఒకటీ కాదు.. రెండు కూడా కాదు.. మూడుపంటలకు టార్గెట్ పెట్టినట్టు కనిపిస్తున్నది. లేకపోతే అంతంత రిజర్వాయర్లా? చూడబోతే గోదావరిలో ఏ వెయ్యో రెండువేల టీఎంసీలో లాగేసేలాగున్నాడు అన్నాడు. ఎలా సాధ్యం?.. బోర్డులు ఉంటాయి.. కేటాయింపులు, ఒప్పందాలు.. ఉంటాయి కదా అంటే నవ్వాడు. కేటాయింపులు, ఒప్పందాలు మేం పాటించామా? మహారాష్ట్ర అన్ని బ్యారేజీలు కడుతుంటే ఎవరేం చేయగలిగారు? చెప్పేదానికి చేసేదానికి ఎక్కడా పొంతన ఉండదు. ఇన్నాళ్లు మేం రెండు పంటలకు లాగేశాం. ఇపుడు మీ వంతు. అదృష్టవంతులు.. మీరు పైనున్నారు.. పైగా కేసీఆర్ ఉన్నాడు అన్నాడు. విపక్షాలు వింటున్నాయా?!

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...