Jump to content

సెవెన్‌హిల్స్‌ హాస్పిటల్స్‌ దివాలా!


TampaChinnodu

Recommended Posts

సెవెన్‌హిల్స్‌ హాస్పిటల్స్‌ దివాలా! 
రూ.737 కోట్లకు చేరిన గ్రూప్‌ బకాయిలు 
దివాలా పరిష్కార ప్రక్రియకు యాక్సిస్‌ బ్యాంకు దరఖాస్తు 
అనుమతించిన జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ 
ఐఆర్‌పీగా గుడ్‌గావ్‌కు చెందిన అభిలాష్‌లాల్‌ నియామకం 
ఆస్తుల క్రయవిక్రయాలపై నిషేధం 
ఈనాడు - హైదరాబాద్‌

బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని చెల్లించక చేతులెత్తేస్తున్న కంపెనీల సరసన తాజాగా సెవెన్‌హిల్స్‌ ఆస్పత్రి గ్రూపు చేరింది. ముంబయి, విశాఖపట్నంలలో ఆస్పత్రులు నిర్వహిస్తున్న సెవెన్‌హిల్స్‌ హెల్త్‌కేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ యాక్సిస్‌, తదితర బ్యాంకులకు బకాయిపడ్డ మొత్తం రూ.737.58 కోట్లకు చేరుకుంది. రుణ బకాయి చెల్లించడానికి జిల్లా కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా గడువు ఇచ్చినా ప్రయోజనం లేకపోవడంతో యాక్సిస్‌ బ్యాంకు.. జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) హైదరాబాద్‌ ధర్మాసనాన్ని ఆశ్రయించింది. దివాలా పరిష్కార ప్రక్రియ (కార్పొరేట్‌ ఇన్‌సాల్వెన్సీ రెజల్యూషన్‌ ప్రాసెస్‌)ను చేపట్టాలంటూ యాక్సిస్‌ బ్యాంకు ఐబీసీ కోడ్‌ సెక్షన్‌ 7 కింద దరఖాస్తు చేసింది. దీనిపై ఎన్‌సీఎల్‌టీ జ్యుడీషియల్‌ సభ్యులు రాజేశ్వరరావు విత్తనాల విచారణ చేపట్టి దివాలా ప్రక్రియ ప్రారంభానికి   అనుమతిని మంజూరు చేస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.

యాక్సిస్‌ నుంచి 418.21 కోట్లు.. 2004 ఏప్రిల్‌ 13న సెవెన్‌హిల్స్‌ హెల్త్‌కేర్‌ రూ.401 కోట్ల అధీకృత మూలధనంతో కంపెనీ చట్టం కింద ఏర్పాటైంది. సెవెన్‌హిల్స్‌కు ద్వైపాక్షిక సౌకర్యాలందించడంలో భాగంగా యాక్సిస్‌ బ్యాంకు నుంచి రూ.418.21 కోట్లు, కన్సార్టియం కింద మరో రూ.271.19 కోట్లు రుణం మంజూరైంది. ఎప్పటికప్పుడు సెవెన్‌హిల్స్‌.. పలు స్థిర, చరాస్తులను రుణాలకు హామీగా సమర్పిస్తూ వచ్చింది. క్రమంగా నిర్వహణ సామర్థ్యం తగ్గడంతో ఆసుపత్రి నష్టాలబాట పట్టింది. మెరుగైన సేవలందించడానికిగాను యాక్సిస్‌ బ్యాంకుతో రుణ పునర్నిర్మాణ ఒప్పందాలు జరిగాయి. వ్యవస్థాపకులు హామీదారులుగా పలు హామీలు సమర్పించారు. 2014 జూన్‌ 30న యాక్సిస్‌ బ్యాంకుతో ఆసుపత్రి ట్రస్టీల ఒప్పందం కుదిరింది. అయితే, ఒప్పందం ప్రకారం వాయిదాలు చెల్లించకపోవడంతో 2016 ఏప్రిల్‌ 2 నాటికి రూ.737.58 కోట్లను నిరర్ధక ఆస్తులుగా ప్రకటించి యాక్సిస్‌ బ్యాంకు.. సెవెన్‌హిల్స్‌కు నోటీసులు జారీ చేసింది. తాకట్టులో ఉన్న వాటాలను వెనక్కి తీసుకుంటామని బ్యాంకు ట్రస్ట్‌ను కోరింది. అయితే, తాకట్టులో ఉన్న వాటాలను మార్చుకోవడాన్ని సవాల్‌ చేస్తూ సెవెన్‌హిల్స్‌ ప్రమోటర్స్‌ జితేంద్ర మాగంటి, మాగంటి జితేంద్ర దాస్‌ (హెచ్‌యూఎఫ్‌) జిల్లా కోర్టు నుంచి సుప్రీం కోర్టుదాకా వెళ్లినా ఫలితం లేకపోయింది. నిర్దుష్ట గడువు విధించి బకాయి చెల్లించాలని ఆదేశించినా అమలు చేయకపోవడంతో బ్యాంకు ట్రైబ్యునల్‌ను ఆశ్రయించి దివాలా పరిష్కార ప్రక్రియకు అనుమతించాలని కోరింది.

దివాలా ప్రక్రియను బహిరంగ పరచాలి.. దివాలా ప్రక్రియ పరిష్కార నిపుణుడి(ఐఆర్‌పీ/సీఐఆర్‌పీ)గా గుడ్‌గావ్‌కు చెందిన అభిలాష్‌లాల్‌ను జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ నియమించింది. సెవెన్‌హిల్స్‌ గ్రూపు, హామీదారుల ఆస్తుల క్రయవిక్రయాలపై నిషేధం విధించారు. ఆస్తులను అన్యాక్రాంతం చేయడంగానీ, హక్కులను బదిలీ చేయడంగానీ చేయరాదని ఎన్‌సీఎల్‌టీ జ్యుడీషియల్‌ సభ్యుడు రాజేశ్వరరావు స్పష్టంచేశారు. తాకట్టు ఆస్తులపై నిషేధం ఉంటుందన్నారు. ఆస్పత్రికి వ్యతిరేకంగా దిగువ కోర్టులు, ట్రైబ్యునళ్లు, మధ్యవర్తిత్వం, ఇతర న్యాయస్థానాల్లో ఏవైనా పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నా, తీర్పులు వెలువడి అమలుకు ఆదేశాలిచ్చి అమలుకాకపోయినా ఈ నిషేధం వర్తిస్తుందని వెల్లడించారు. దివాలా ప్రక్రియ ప్రారంభం గురించి బహిరంగంగా ప్రకటించాలని, ఐబీబీఐ (ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్రప్టసీ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా) వెబ్‌సైట్‌లో ఉంచడంతోపాటు మీడియా ద్వారా ప్రకటనలు ఇవ్వాలని ఐఆర్‌పీకి సూచించారు. ఈ విషయాన్ని ఆస్పత్రి వెబ్‌సైట్‌లోనూ పేర్కొనాలని ఆదేశించారు.

డాక్టర్ల వేతనాలకు ప్రాధాన్యమివ్వాలి.. సెవన్‌హిల్స్‌ గ్రూపులో పనిచేసే డాక్టర్‌ అమిత్‌ రావ్‌ డియో మరో 49 మంది డాక్టర్లు తమను ప్రతివాదులుగా చేర్చాలంటూ పిటిషన్‌ దాఖలు చేయగా.. డాక్టర్లు తమ సమస్యలను ఐఆర్‌పీ దృష్టికి తీసుకెళ్లాలంటూ రాజేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు. ఆస్పత్రికి వెన్నెముక లాంటి వైద్యుల జీతభత్యాల చెల్లింపునకు అత్యవసర విభాగంగా పరిగణనలోకి తీసుకుని ప్రాధాన్యం ఇవ్వాలని ఐఆర్‌పీకి సూచించారు. బకాయిలు రావాల్సి ఉందని.. తమనూ ప్రతివాదులుగా చేర్చుకోవాలన్న గ్రేటర్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ అభ్యర్థనను అనుమతించారు. పరికరాల సరఫరా చేసినందున రూ.21.71 లక్షలు వడ్డీతో రావాల్సి ఉందంటూ ముంబయికే చెందిన త్రిశూల్‌ ఎలక్ట్రోమెక్‌ ఇంజనీరింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నుంచి ఈ నెల 7న అందిన లేఖనూ దివాలా పరిష్కార ప్రక్రియలో పరిగణనలోకి తీసుకోవాలన్నారు. రుణ బకాయిలు వివరాలు అందిన తరువాత రుణదాతల కమిటీని ఏర్పాటు చేయాలని, ఏర్పాటైన వారంలోగా సమావేశం నిర్వహించి సమాచారం ట్రైబ్యునల్‌కు అందజేయాలని ఐఆర్‌పీని ఆదేశించారు. దివాలా పరిష్కార ప్రక్రియకు సంబంధించిన నివేదికను ఏప్రిల్‌ 17న సమర్పించాలంటూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...