Jump to content

లంచావతారుల వల్లే ఆత్మహత్య?


snoww

Recommended Posts

లంచావతారుల వల్లే ఆత్మహత్య? 
‘మీకోసం’ కార్యక్రమానికి పురుగులమందు తాగొచ్చిన బాధితుడు 
కలెక్టరేట్‌లో జేసీ-2కు మరణవాంగ్మూలం అందజేత 
వెంటనే ఆసుపత్రికి తరలించాలని ఆదేశించిన జేసీ 
కార్లు అందుబాటులో ఉన్నా పట్టించుకోని అధికారులు 
అరగంట తరువాత ఆటోలో తీసుకెళ్తుండగా మృతి 
3ap-main7a.jpg

మచిలీపట్నం, న్యూస్‌టుడే: ‘అధికారుల కారణంగా అన్యాయం జరిగిందని 10 నెలలుగా ప్రజావాణిలో అర్జీలు సమర్పిస్తున్నా న్యాయం జరగలేదు. లంచాలకు అలవాటుపడిన అధికారులు నన్ను మోసం చేశారు. అధికారుల తీరు, కొందరి వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నాను’ అంటూ ఓ  వ్యక్తి కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో మీకోసం కార్యక్రమంలో మరణవాంగ్మూలం పేరుతో అర్జీ ఇచ్చాడు. అప్పటికే పురుగులమందు తాగానంటూ బాధితుడు జేసీ టేబుల్‌పై ఖాళీ డబ్బా పెట్టాడు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లమని ఉన్నతాధికారి ఆదేశించినా..పలు కార్లు అందుబాటులో ఉన్నా..అధికారులు అతణ్ని సకాలంలో ఆసుపత్రికి తరలించలేకపోయారు. అరగంట తరువాత పోలీసులు బాధితుడిని ఆటోలో ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో.. ప్రైవేటు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ప్రాంతానికి చెందిన సీతారామవరప్రసాద్‌ మరో వ్యక్తితో కలిసి రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేసేందుకు ముదినేపల్లి మండలం పెయ్యేరులో రెండు ఎకరాలకు పైగా భూమిని కొనుగోలు చేశారు. ఈ భూమి లేఅవుట్‌ విషయంలో సంబంధిత అధికారులు సక్రమంగా వ్యవహరించలేదని, నాలా పన్ను కట్టించుకునే అంశంలో భూమి మార్కెట్‌ విలువ తక్కువగా చూపించి ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారని ఆరోపిస్తూ గతంలో ఫిర్యాదు చేశారు. లే అవుట్‌లో ఉన్న ఇబ్బందులు, నాలా పన్ను తదితర అంశాల కారణంగా కొనుగోలు చేసిన భూమిని వేరొకరికి అమ్ముకునే అవకాశం లేకుండా పోయిందంటూ  స్థానిక పోలీస్‌ స్టేషన్‌లోనూ గతంలో ఫిర్యాదు చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో మీకోసం కార్యక్రమానికి వచ్చారు. మీకోసం నిర్వహిస్తున్న జేసీ-2 బాబూరావు వద్దకు వెళ్లి అధికారులు తనను ఎలా మోసం చేసిందీ వివరించారు. తనకు న్యాయం దక్కుతుందన్న నమ్మకం లేక పురుగులమందు తాగి వచ్చానంటూ.. ఖాళీ డబ్బాను జేసీ ముందుంచారు. పెయ్యేరుకు చెందిన సతీష్‌చౌదరి, వెంకట్రావు, రాజకుమారి కుటుంబం, ముదినేపల్లికి చెందిన కృష్ణకిషోర్‌లు తన మరణానికి కారణమంటూ మరణవాంగ్మూలం పేరుతో ఓ అర్జీని అందజేశారు. జేసీ-2 ప్రసాద్‌ను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లమని ఆదేశించారు. జిల్లా ఆస్పత్రికి తీసుకువెళ్లిన పోలీసులు..మెరుగైన చికిత్స కోసం స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు.

న్యాయ విచారణకు ఆదేశించిన కలెక్టర్‌ 
కలెక్టరేట్‌లో చోటు చేసుకున్న సంఘటనపై జిల్లా కలెక్టర్‌ లక్ష్మీకాంతం న్యాయ విచారణకు ఆదేశించారు. జేసీ-2 బాబూరావును విచారణాధికారిగా ఆదేశిస్తూ సమగ్ర విచారణ నిర్వహించి నివేదిక ఇవ్వాలని సూచించారు. పెయ్యేరు గ్రామంలో ప్రైవేటు భూమికి సంబంధించిన నియమ నిబంధనలు పరిశీలించి, ఏవైనా అక్రమాలు గుర్తిస్తే బాధ్యులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. బాధితుడి కుటుంబానికి ఆర్థికసాయం అందేలా చూస్తామని కలెక్టర్‌ పేర్కొన్నారు.

సకాలంలో ఆసుపత్రికి చేర్చిఉంటే.. 
వరప్రసాద్‌ తాను పురుగుమందు తాగానని చెప్పిన వెంటనే జేసీ-2 చికిత్సకు తీసుకెళ్లాల్సిందిగా ఆదేశించినా.. అతణ్ని ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు వాహనం కోసం దాదాపు అరగంట సమయం తీసుకున్నారు. ఈలోపు 108కి కూడా ఫోన్‌ చేసిన దాఖలాలు కన్పించలేదు. మీకోసం కార్యక్రమానికి వచ్చిన అధికారులకు చెందిన వాహనాలు అనేకం ఉన్నా ఉపయోగించలేదు. చివరకు పోలీసుల సాయంతో ఓ ఆటోను తీసుకొచ్చి జిల్లా ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచాడు. అధికారులు సకాలంలో స్పందించి ఉంటే వరప్రసాద్‌ ప్రాణాలు దక్కేవేమోనన్న భావనను పలువురు వ్యక్తంచేశారు. ఈ విషయంలో అధికారుల తీరు తీవ్ర విమర్శలకు తావిచ్చింది.

Link to comment
Share on other sites

చుట్టూ అందరూ.. చూసి వదిలేశారు.. 
amr-gen1a.jpg

ఉదయం 11 గంటల సమయం..  ఎప్పటిలాగే సోమవారం కలెక్టరేట్‌లో ‘మీకోసం’ కార్యక్రమాన్ని అధికారులు నిర్వహిస్తున్నారు. 
ఉదయం 11.15 గంటలు :  సీహెచ్‌  సీతారామవరప్రసాద్‌ అనే వ్యక్తి కలెక్టరేట్‌లోనికి అడుగుపెట్టారు.. 11.30 గంటలకు...  అధికారుల ముందుకొచ్చి అర్జీ ఇచ్చారు. ‘ అధికారులు న్యాయం చేయలేదు. ఎన్నిసార్లు తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆవేదనతో నేను పురుగు మందు తాగాను’.. అని చెప్పి అధికారుల ముందు పురుగుల మందు డబ్బా పెట్టారు. కంగారు పడ్డ అధికారులు అక్కడే ఉన్న పోలీసులను పిలిచి బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలని తెలిపారు.

సమయం మించిపోయింది.. 
అక్కడ అన్ని వాహనాలున్నా బాధితుడిని ఆసుపత్రికి తీసుకెళ్లడానికి 20 నిమిషాలు గడిచిపోయాయి. సీతారామ వరప్రసాద్‌ అక్కడే అరుగుల మీద పడి ఉంటే కొందరు అతనితో మాట్లాడారు.. మరికొందరు చరవాణీల్లో ఆ మాటలను బంధించారు. ఆసుపత్రికి తీసుకెళ్లాలన్న కనీస ధర్మం మరిచి అందరూ చోద్యం చూశారు. దాదాపు మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆటోలో బాధితుడిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.

మధ్యాహ్నం 12.10:  జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది ప్రాథమిక వైద్య సేవలందించారు. మెరుగైన వైద్య సేవలు అవసరమని గుర్తించారు. అక్కడ మరో 20 నిమిషాలు గడిచిపోయాయి. అప్పుడు అక్కడి నుంచి ఓ ప్రైవేటు                 ఆసుపత్రికి తరలించారు. అక్కడికి చేరుకొనేలోపే కాలాతీతమైపోయింది.. బాధితుడి ప్రాణం గాల్లో కలిసిపోయింది..

పెయ్యేరు (ముదినేపల్లి), కలెక్టరేట్‌ (మచిలీపట్నం) న్యూస్‌టుడే: కాసులు వర్షం కురిపిస్తుందనే ఆశతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం నిమిత్తం జిల్లా దాటి వచ్చిన ఓ వ్యక్తి ముందుచూపుతో వ్యవహరించకుండా తన ప్రాణాలకే ముప్పు తెచ్చుకున్నారు. వ్యాపార పరంగా ఎదురైన పరిస్థితులే అతన్ని ఆత్మహత్య చేసుకునేలా చేశాయి.

పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి చుండూరు సీతారామవరప్రసాద్‌ మరో భాగస్వామితో కలిసి ముదినేపల్లి మండలం పెయ్యేరులోని కైకలూరు రహదారిలో భూమికి కొంత మేర నగదు చెల్లించి  28 ప్లాట్లుగా వేసి సంబంధిత రైతుల పేరుతో డీటీసీపీ నుంచి లేవుట్‌ అప్రూవల్‌ పొందారు. భూమి విలువ పెరిగిన నేపథ్యంలో తనకు భూమి ఇచ్చిన రైతులు రిజిస్ట్రేషన్‌ చేయకుండా ఇబ్బందులు పాలుచేయడమే కాకుండా నాలా చెల్లింపు విషయంలో కూడా ప్రభుత్వాన్ని మోసం చేశారని గడచిన కొన్ని నెలలుగా సీతారామవరప్రసాద్‌ ఆరోపిస్తున్నారు. ఈ విషయంపైనే స్థానిక గ్రామ పంచాయతీ, పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. అక్కడ ఎటువంటి స్పందన కన్పించకపోవడంతో కలెక్టరేట్‌లో నిర్వహించే ‘మీకోసం’లో న్యాయం కోరుతూ అర్జీ ఇచ్చారు. అయినా ఫలితం లేకపోవడంతో సోమవారం కలెక్టరేట్‌కు వచ్చిన బాధితుడు కొందరు అధికారులు విచారణను తప్పుదోవపట్టించారని, లంచం తీసుకొని నిర్లక్ష్యం చేయటం వల్లనే తాను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నానని తెలియజేస్తూ ‘మీకోసం’ నిర్వహిస్తున్న జేసీ-2 బాబూరావుకు అర్జీ ఇచ్చారు. అధికారుల నిర్లక్ష్యంతో పాటు తన మృతికి స్థానికులు మరో నలుగురు కారణమని.. ఇది తన మరణవాగ్మూలం అంటూ అర్జీలో పేర్కొన్నారు. పెయ్యేరు లేఅవుట్‌ విషయంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సీతారామవరప్రసాద్‌ గతంలో కూడా ఆత్మహత్యాయత్నం చేశాడన్న వాఖ్యానాలు గ్రామంలో వినిపించాయి. సంఘటన విషయం తెలుసుకున్న కలెక్టర్‌ లక్ష్మీకాంతం బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు.  స్పష్టంగా ఏ నెలలో ఫిర్యాదు చేసింది అర్జీలో లేకపోవడంతో తొలుత అతను అర్జీ ఇవ్వలేదని భావించారు. కలెక్టర్‌ జోక్యంతో విచారణ చేపట్టడంతో ఈ ఏడాది జనవరి 30వ తేదీన అతను ఫిర్యాదు ఇచ్చినట్టు.. దానికి సంబంధిత డీఎల్‌పీవోకు పంపినట్టు తెలుస్తోంది.

మృతుని కుటుంబానికి రూ.50వేల సాయం అందజేత 
ముదినేపల్లి, న్యూస్‌టుడే: ఆత్మహత్యకు పాల్పడి మృతిచెందిన చుండూరు సీతారామవరప్రసాద్‌ కుటుంబానికి ప్రభుత్వ సాయం కింద రూ.50వేలు అందజేసినట్లు తహసీల్దారు డి.రాజ్యలక్ష్మి తెలిపారు. మచిలీపట్నంలోని ఆసుపత్రిలో సోమవారం సాయంత్రం ఆమె మృతుడి భార్య, బంధువులను కలిసి పరామర్శించారు. అనంతరం ఆమె రూ.50వేల చెక్కును మృతుడి భార్యకు అందించారు. ప్రభుత్వ సాయంగా గుడివాడ ఆర్డీవో సత్యవాణి ఇచ్చిన రూ.50వేల చెక్కును మృతుని కుటుంబానికి అందించినట్లు ఆమె తెలిపారు.

మృతిపై కేసు నమోదు 
మచిలీపట్నం క్రైం, న్యూస్‌టుడే: కలెక్టరేట్‌లో ఆత్యహత్యాయత్నానికి పాల్పడి మృతి చెందిన చుండూరు సీతారామవరప్రసాద్‌ మృతి సంఘటనపై అతని భార్య ఉదయలక్ష్మి సోమవారం రాత్రి చిలకలపూడి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.. పోలీసులు తెలిపిన వివరాల మేరకు తన భర్త కొనుగోలు చేసిన భూమి విషయంలో సంబంధిత రైతులు మోసం చేయడమే కాకుండా ఆత్యహత్య చేసుకునేలా ప్రేరేపించారని, కొందరు అధికారులు కూడా వారితో కుమ్మక్కయ్యారంటూ ఉదయలక్షి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్టు సీఐ దుర్గాప్రసాద్‌ తెలిపారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...