Jump to content

Serial killer caught


kakatiya

Recommended Posts

ఆ ముగ్గుర్నీ చంపింది ఆ మానవ మృగమే!

ఆ ముగ్గుర్నీ చంపింది ఆ మానవ మృగమే!

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన యాదాద్రి భువనగిరి జిల్లాలో వరుస హత్యల మిస్టరీని పోలీసులు ఛేదించారు. శ్రావణి, మనీషా, కల్పనలను హత్యచేసింది మర్రి శ్రీనివాస్‌ రెడ్డేనని తేల్చారు. ముగ్గురు బాలికలపైనా అత్యాచారం చేసి ఆపై హత్య చేసినట్టు నిందితుడు అంగీకరించాడని రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ వెల్లడించారు. విపరీతమైన ఉన్మాద ప్రవర్తనతోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని తెలిపారు. 2015లో బొమ్మలరామారంలో ఓ యువతిపై లైంగిక దాడికి పాల్పడటంతో గ్రామస్థులంతా అతడిని పట్టుకొని చెట్టుకు కట్టేసి కొట్టారని, అప్పటి నుంచి ఉన్మాదిగా మారి బాలికలపై అత్యాచారం, హత్యలకు పాల్పడినట్టు సీపీ వివరించారు. మొత్తం నాలుగు హత్యకేసుల్లో శ్రీనివాస్‌ రెడ్డి నిందితుడిగా ఉన్నాడని తెలిపారు. అతడికి (28) ఇంకా వివాహం కాలేదని, తరచూ అతడు వేములవాడకు వెళ్తుంటాడన్నారు. వేములవాడకు చెందిన ఓ అమ్మాయితో పెళ్లికి ప్రయత్నాలు చేస్తున్నాడని తెలిపారు.  లిఫ్ట్‌ ఇస్తానంటూ బాలికలను నమ్మించి దురాగతానికి పాల్పడిన నిందితుడు శ్రీనివాస్‌ రెడ్డికి ఉరిశిక్ష పడేలా చేస్తామని చెప్పారు. ఈ వరుస హత్యోదంతాలకు సంబంధించిన పూర్తి వివరాలను రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌లో మహేశ్‌ భగవత్‌ మీడియాకు వెల్లడించారు.

‘‘తన కుమార్తె  అదృశ్యమైందంటూ ఈ నెల 25న శ్రావణి అనే బాలిక తండ్రి ఫిర్యాదు చేశారు. ఆ బాలిక ఆచూకీ కోసం 27న సిట్‌ ఏర్పాటు చేశాం. షీటీమ్స్‌, పోలీసులు, ఐటీ సెల్‌ దర్యాప్తు చేశాయి. మర్రి శ్రీనివాస్‌ రెడ్డికి చెందిన బావిలోనే శ్రావణి మృతదేహం గుర్తించాం. గ్రామస్థులు చెప్పిన వివరాల మేరకు అతడిపై అనుమానం వచ్చింది. ఈ నెల 26న సాయంత్రం నుంచి అతడు పరారీలో ఉన్నాడు. దీంతో శ్రావణిపై అత్యాచారం చేసి హత్య చేసినట్టు ప్రాథమికంగా గుర్తించాం. రావిర్యాల గ్రామంలో బంధువుల ఇంట్లో నిందితుడు ఉన్నట్టు సమాచారం అందడంతో అక్కడకు వెళ్లి అతడిని అదుపులోకి తీసుకున్నాం. గతంలో కర్నూలులోనూ శ్రీనివాస్‌ రెడ్డిపై కేసు నమోదైంది. కర్నూలులో 2017లో ఓ వేశ్యను హత్య చేసిన కేసులో అరెస్టయ్యాడు. మర్రి శ్రీనివాస్‌కు మద్యం, గంజాయి అలవాటు ఉంది.  మహా శివరాత్రి రోజున మనీషా అదృశ్యమైందని ఆమె తండ్రి ఫిర్యాదు చేశారు. మనీషా ఘట్‌కేసర్‌లోని ఓ కళాశాలలో బీకాం చదువుతోంది. శ్రావణి, మనీషాల మృతదేహాలు రెండూ మర్రి శ్రీనివాస్‌ రెడ్డి బావిలోనే దొరికాయి. ఇంటికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్న బాలికకు శ్రీనివాస్‌ రెడ్డి లిఫ్ట్‌ ఇచ్చాడు. బాలికను బావిలోకి నెట్టేసి, గాయాలతో ఉన్నప్పుడే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికలు బయటకు వెళ్లే సమయాలపై రెక్కీ నిర్వహించాడు. అనంతరం వారిని వెంబడించి ద్విచక్రవాహనంపై లిఫ్ట్‌ ఇచ్చాడు’’ అని సీపీ తెలిపారు.

హత్యలన్నీ ఒంటరిగానే చేసినట్టు తేలింది!
‘‘కల్పన అనే బాలిక కనిపించడంలేదని 2015లో బొమ్మలరామారం పీఎస్‌లో కేసు  నమోదైంది. హజీపూర్‌లోని బంధువుల ఇంటికి వెళ్లినప్పుడే కల్పన అదృశ్యమైంది. కల్పనపై 2015లోనే బొమ్మలరామారంలో లైంగిక దాడికి పాల్పడినట్టు శ్రీనివాస్‌ రెడ్డి ఒప్పుకొన్నాడు. కల్పన మృతదేహాన్ని సంచిలో పెట్టి తీసుకెళ్లి మరో బావిలో వేసినట్టు నిందితుడు చెప్పాడు. శ్రీనివాస్‌ రెడ్డి గతంలో ఓ మహిళను వేధించడంతో గ్రామస్థులు అతడ్ని పట్టుకొని చెట్టుకు కట్టేసి కొట్టడం వల్ల అప్పటి నుంచి ఉన్మాదిగా మారాడు. ఉన్మాదిగా మారి బాలికలపై అత్యాచారం, హత్యలకు పాల్పడ్డాడు. మొత్తం ఐదు కేసుల్లో శ్రీనివాస్‌ రెడ్డి నిందితుడిగా ఉన్నాడు. బొమ్మలరామారం పరిధిలో చేసిన ఘాతుకాలన్నీ ఒంటరిగానే చేసినట్టు విచారణలో తేలింది. శ్రావణి, మనీషా, కల్పన హత్య కేసులో మరింత లోతుగా దర్యాప్తు జరుగుతోంది. ఈ కేసు దర్యాప్తులో రాచకొండ పోలీసులు చాలా శ్రమించారు. నిందితుడిని ఈ రోజు మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరిచి రిమాండ్‌కు తరలిస్తాం. ఇంకా ఏమైనా ఉంటే ఆ కేసులను గుర్తిస్తాం. శ్రీనివాస్‌ రెడ్డి గతంలో పనిచేసిన వేములవాడ, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ తదితర ప్రాంతాల్లో ఇలాంటి దారుణాలకు ఏమైనా పాల్పడ్డాడా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తాం. ఈ కేసు తదుపరి విచారణను భువనగిరి ఏసీపీ భుజంగరావుకు అప్పగించాం’’ అని సీపీ వివరించారు.

కొత్తవారి వెంట పిల్లల్ని పంపించొద్దు
‘‘తల్లిదండ్రులు పిల్లలను కొత్తవారి వెంట పంపించొద్దు. కొత్త వారు వాహనాలపై లిఫ్ట్‌ ఇస్తేవెళ్లొద్దు. నిందితుడికి ఉరిశిక్ష పడేలా చేస్తాం. ఘట్‌కేసర్‌ పరిసరాల్లో గంజాయి విక్రయాలపై చర్యలు తీసుకుంటాం. బాలికల అదృశ్యం ఘటనలు ఇంకా ఉంటే వెంటనే ఫిర్యాదు చేయండి’’ అని మహేశ్‌ భగవత్‌ తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.

Link to comment
Share on other sites

  • 2 weeks later...

13main7a_1.jpg

ఈనాడు, నల్గొండ: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌ వరుస హత్యల కేసులో నిందితుడైన మర్రి శ్రీనివాస్‌రెడ్డి అలియాస్‌ అంజి పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలను వెల్లడించినట్లు తెలిసింది. ఈ నెల 8 నుంచి 13వ తేదీ వరకు కోర్టు నుంచి తమ కస్టడీలోకి తీసుకున్న పోలీసులు ఐదు రోజుల పాటు నిందితుడిని వివిధ కోణాల్లో విచారించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. శ్రీనివాస్‌రెడ్డి నుంచి స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్‌లో చాలా మంది యువతుల ఫొటోలను పోలీసులు గుర్తించారు. ఒక్కో ఫొటోను అతనికి చూపిస్తూ వారు ఎవరు... అవి ఎందుకు సెల్‌ఫోన్‌లో ఉన్నాయనే కోణంలో విచారించారు. ‘‘అందంగా ఉన్న అమ్మాయిల ఫొటోలను సెల్‌ఫోన్‌లో బంధించడం అలవాటు, అంతే తప్ప వారితో ఎలాంటి సంబంధం లేదు’’ అని విచారణలో వెల్లడించినట్లు తెలిసింది. దీంతో శ్రావణి హత్య కేసు వెలుగులోకి వచ్చిన రెండు మూడు రోజుల ముందు ఎవరెవరికి కాల్‌ చేశాడో ఆ డేటా ఆధారంగా ఈ అమ్మాయిలకు.. శ్రీనివాస్‌రెడ్డికి, హత్యకేసులకు ఏదైనా సంబంధం ఉందా అనే కోణంలోనూ విచారించినట్లు సమాచారం. సెల్‌ఫోన్‌లో ఉన్న అమ్మాయిల పేర్లను శ్రీనివాస్‌రెడ్డి నుంచి తెలుసుకుంటూ వారి ఫేస్‌బుక్‌, ట్విటర్‌ ఖాతాలను కూడా పోలీసులు క్షుణ్నంగా పరిశీలన చేసినట్లు తెలిసింది. మరోవైపు లిఫ్ట్‌ మెకానిక్‌గా శ్రీనివాస్‌రెడ్డి పనిచేసిన కర్నూలు, వేములవాడ ప్రాంతాలతో పాటు బొమ్మలరామారం, ఈసీఐఎల్‌, కీసర, హాజీపూర్‌ ప్రాంతాల్లో పెండింగ్‌లో ఉన్న మిస్సింగ్‌ కేసుల్లో భాగస్వామ్యం ఉందా అనే కోణంలో నిందితుడిని ప్రశ్నించగా దీనికి అతన్నుంచి సమాధానం ఏమీ రాలేదని సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. ఈ ఐదు రోజుల కస్టడీలో పోలీసులు తొలి రెండు రోజులు రాత్రిపూట హాజీపూర్‌ సమీపంలోని శ్రావణి, మనీషా, కల్పనలను హత్య చేసిన బావుల వద్ద కేసు పునర్నిర్మాణం (రీ కన్‌స్ట్రక్షన్‌) చేసి హత్యలు ఎలా చేశారో తెలుసుకున్న పోలీసులు.. వారడిగిన పలు ప్రశ్నలకు నిందితుడు జవాబివ్వలేదని సమాచారం. నల్గొండ న్యాయస్థానం ఆదేశాల మేరకు ఈ నెల 8న వరంగల్‌ కేంద్ర కారాగారం నుంచి శ్రీనివాస్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 5 రోజులపాటు హైదరాబాద్‌లోని ఓ రహస్య ప్రాంతంలో విచారించారు. కస్టడీ గడువు ముగియడంతో సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని కోర్టులో హాజరుపర్చారు. తిరిగి న్యాయస్థానం ఆదేశాల మేరకు అతన్ని వరంగల్‌ కేంద్ర కారాగారానికి తరలించారు.

Facebook ShareTwitter ShareWhatsApp Share
Link to comment
Share on other sites

  • 8 months later...
హాజీపూర్‌ హత్యలు..శ్రీనివాసరెడ్డే దోషి

హాజీపూర్‌ హత్యలు..శ్రీనివాసరెడ్డే దోషి

నల్గొండ: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హాజీపూర్ హత్యల కేసులో తుది తీర్పు వెల్లడైంది. నిందితుడు మర్రి శ్రీనివాస్‌రెడ్డిని దోషిగా తేలుస్తూ నల్గొండలోని పోక్సో న్యాయస్థానం తీర్పు వెలువరించింది. భోజన విరామం అనంతరం కిక్కిరిసిన కోర్టు హాలులో పోలీసులు నిందితుడిని ప్రవేశపెట్టగా న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు. యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో 20 ఏళ్లు కూడా నిండని ముగ్గురు అమ్మాయిలను అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్‌రెడ్డి కిడ్నాప్‌, అత్యాచారం, హత్య చేయడంపై గతేడాది ఏప్రిల్‌లో మూడు కేసులు నమోదయ్యాయి. అంతకుముందే కర్నూలు జిల్లాలో అతడిపై మరో హత్యకేసు నమోదైంది. బాధితులంతా మైనర్లు కావడంతో నిందితుడిపై చిన్న పిల్లలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం (పోక్సో) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దాదాపు మూడు నెలల పాటు బాధితుల తల్లిదండ్రులు, బంధువులు, ప్రత్యక్ష సాక్షులు, ఫొరెన్సిక్‌ నిపుణులు, పోలీసులు, పంచనామా చేసినవారు.. ఇలా మొత్తం 101 మంది సాక్షులను పోక్సో కోర్టు విచారించింది

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...