Jump to content

దేశంలో ప్రతి పల్లెకూ వెళ్తాం..


All_is_well

Recommended Posts

దేశంలో నిర్మాణాత్మక మార్పు వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని భారాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. దేశంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర నిరాశలో ఉన్నారని, ఒక వ్యక్తిని, ఒక పార్టీని విమర్శించడం తన ఉద్దేశం కాదని, గుణాత్మక మార్పు కోసం మేధావులు, యువత ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రజలకు తెలంగాణ పథకాలను వివరిస్తాం
త్వరలో మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, హరియాణా, పంజాబ్‌లకు పార్టీ విస్తరణ
ప్రజల స్థితిగతులు మారకుంటే ఎవరు గెలిచినా వృథానే
భారాస అధినేత, సీఎం కేసీఆర్‌
నాగ్‌పుర్‌లో పార్టీ కార్యాలయం ప్రారంభం

KCR: దేశంలో ప్రతి పల్లెకూ వెళ్తాం

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలో నిర్మాణాత్మక మార్పు వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని భారాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. దేశంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర నిరాశలో ఉన్నారని, ఒక వ్యక్తిని, ఒక పార్టీని విమర్శించడం తన ఉద్దేశం కాదని, గుణాత్మక మార్పు కోసం మేధావులు, యువత ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో భారాస కార్యాలయాన్ని పార్టీ అధినేత కేసీఆర్‌ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో, విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలోని ప్రతి పల్లెకూ వెళ్లి తెలంగాణ పథకాలను వివరిస్తామని కేసీఆర్‌ తెలిపారు. దేశమంతటా తెలంగాణ మోడల్‌ అమలయ్యేవరకు పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు. దేశంలో మార్పు.. మహారాష్ట్ర నుంచే ప్రారంభం కావాలని పిలుపునిచ్చారు. త్వరలోనే మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, హరియాణా, పంజాబ్‌ల్లోనూ పార్టీని విస్తరించనున్నామని వెల్లడించారు.  ‘దేశం మారాల్సిన సమయమొచ్చింది. ప్రజలు తమ ఆలోచన తీరు మార్చుకోకుంటే ఎన్ని ఎన్నికలొచ్చినా మార్పు రాదు. ఎన్నికల్లో ప్రజలు గెలిస్తేనే సమాజం మారుతుంది. ప్రజలు ఆకాశంలో నక్షత్రాలను కోరుకోవడం లేదు. తాగునీరు, సాగునీరు, విద్యుత్‌ వంటి కనీస అవసరాలు అడుగుతున్నారు. ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచింది. భాజపా ఓడింది. ప్రజల సామాజిక స్థితిగతుల్లో మార్పులు రానప్పుడు ఎవరు గెలిచినా వృథానే. ఎస్సీల పరిస్థితుల్లో మార్పులు రానంత కాలం.. దేశాభివృద్ధి జరగదు. దళితులు, ఆదివాసీల అభివృద్ధిలో గణనీయమైన పురోగతి అవసరం. ఆర్థిక, పరిపాలన, రాజ్యాంగం, ఎన్నికలు, న్యాయ వ్యవస్థల్లోనూ సంస్కరణలు చేపట్టాల్సిన అవసరముంది’ అని కేసీఆర్‌ స్పష్టం చేశారు.

KCR: దేశంలో ప్రతి పల్లెకూ వెళ్తాం

మేకిన్‌ ఇండియా ఎక్కడికి పోయిందో!

 

‘దేశంలో 70 వేల టీఎంసీల నీళ్లున్నా తాగునీటి కోసం ప్రజలు గోస పడుతున్నారు. దేశ జల, విద్యుత్‌ విధానాలను మార్చాల్సిన అవసరముంది. ప్రకృతి ప్రసాదించిన నీటిని సమర్థంగా వినియోగించుకోవాలి. క్రమబద్ధంగా వినియోగిస్తే ప్రతి ఎకరాకు, ప్రతి ఇంటికీ నల్లా బిగించి మరీ తాగునీరు అందించవచ్చు. మానవ వనరుల అభివృద్ధి, తలసరి విద్యుత్‌ వినియోగంలో భారత్‌ వెనుకబడింది. రూపాయి మారకం విలువ దారుణంగా పడిపోయింది. పరిశ్రమలు మూతపడుతున్నాయి. రోడ్లు, మౌలిక వనరుల కల్పనలో వెనుకబడ్డాం. మేకిన్‌ ఇండియా ఎక్కడికి పోయిందో దేవుడికే తెలియాలి. కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచిది కాదు. ప్రభుత్వ విద్యుత్‌ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయడానికి మేం పూర్తిగా వ్యతిరేకం. విదేశీ ఆహారాలను తినడం కాదు.. దేశీయ ఆహార పరిశ్రమలు అభివృద్ధి చెందాలి. ఈ మార్పులు ఒక్కరోజులో రావు. అవి వచ్చే వరకు పోరాడుతూనే ఉంటాం.

 

 రైతులు పార్లమెంటులో చట్టాలు చేయలేరా?

 

దేశానికి వెన్నెముక రైతులు. వారు బలమైన శక్తులు. రైతులను అవమానించే వారికి తగిన శాస్తి తప్పదు. దేశానికి అన్నం పెట్టే రైతులు.. పార్లమెంటులో చట్టాలు చేయలేరా? వ్యవసాయానికి ప్రాధాన్యమిస్తే 60 శాతం మందికి ఉపాధి లభిస్తుంది. అందరి అవసరాలకు తగ్గట్లుగా సాగునీరు, విద్యుత్‌ను ఇవ్వడమే భారాస లక్ష్యం. రెవెన్యూ వ్యవస్థలో అవినీతిని పారదోలాలి. తెలంగాణలో రెవెన్యూ అవినీతికి అడ్డుకట్ట వేశాం. రైతాంగానికి ఉచిత విద్యుత్‌, సాగునీరు అందిస్తున్నాం. ప్రతి ఇంటికీ నల్లాల ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నాం. రైతులు తలచుకుంటే ఎలాంటి మార్పునైనా సాధించగలరు. మహారాష్ట్రలో త్వరలోనే పరివర్తన వస్తుంది. దేశమంతా అది విస్తరిస్తుంది. త్వరలోనే ఔరంగాబాద్‌, పుణెల్లోనూ పార్టీ కార్యాలయాలను ప్రారంభిస్తాం.

కేసీఆర్‌కు ఘనంగా స్వాగతం

కేసీఆర్‌కు నాగ్‌పుర్‌లో నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున స్వాగతం పలికారు. పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా నగరం భారాస జెండాలు, ఫ్లెక్సీలు, బ్యానర్లతో కళకళలాడింది. ‘అబ్‌ కీ బార్‌.. కిసాన్‌ సర్కార్‌’ నినాదాలతో కేసీఆర్‌ చిత్రాలతో కూడిన హోర్డింగులు నెలకొల్పారు. నూతన కార్యాలయంలో పార్టీ జెండాను సీఎం ఆవిష్కరించారు. రిబ్బన్‌ కత్తిరించి పార్టీ కార్యాలయంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూజల్లో పాల్గొన్నారు. వేద పండితులు ఆయనను ఆశీర్వదించారు. అనంతరం కేసీఆర్‌.. భారాస నాగ్‌పుర్‌ జిల్లా అధ్యక్షుడు జ్ఞానేశ్‌ వాకోడ్కర్‌ను కుర్చీలో కూర్చోబెట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కేశవరావు, సంతోష్‌కుమార్‌, బీబీ పాటిల్‌, ఎమ్మెల్యేలు బాల్క సుమన్‌, దానం నాగేందర్‌, భారాస ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌, పలువురు ప్రజాప్రతినిధులు, మహారాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.


మా పథకాలు కేంద్రం అమలు చేయడం మంచిదే

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో కొన్నిటిని కేంద్రం కూడా అమలు చేస్తోంది కదా అంటూ ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు కేసీఆర్‌ బదులిస్తూ..

 

‘ప్రధాని మోదీ నాకు మంచి మిత్రుడు. నీతి ఆయోగ్‌ సమావేశాల్లో ఆలోచనలు పంచుకుంటాం. తెలంగాణ పథకాలను దేశమంతటా అమలు చేయడం మంచి పరిణామమే’ అని వ్యాఖ్యానించారు. ‘విదర్భ మాత్రమే కాదు.. ఏ కొత్త రాష్ట్రం ఏర్పాటు చేసినా శాస్త్రీయ పద్ధతిలో ఉండాలి. 50 రాష్ట్రాలు చేసినా స్వాగతిస్తాం. భారాస ఏర్పాటు వల్ల ఏ పార్టీకో లాభం జరుగుతుందనే ప్రచారంలో వాస్తవం లేదు. ప్రజలకు లాభం చేకూర్చడమే భారాస లక్ష్యం. మహారాష్ట్రలో అత్యధిక ఆత్మహత్యలు జరుగుతున్నాయి. వాటిని నివారించడమే లక్ష్యంగా భారాస కార్యాచరణ మొదలుపెట్టాం. మహారాష్ట్రలో జరిగే అన్ని ఎన్నికల్లోనూ పోటీ చేస్తాం’ అని కేసీఆర్‌ వివరించారు.


ఈవీఎంలపై సందేహాలుంటే.. బ్యాలెట్‌ పోలింగ్‌కు వెళ్లడంలో తప్పు లేదు. కేంద్రంలో భారాస సర్కారు రాగానే.. ఏడాది లోపు మహిళా బిల్లు తీసుకొస్తాం. ఎన్నికల్లో 33 శాతం సీట్లు కేటాయిస్తాం.

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...